మనకు తినేందుకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఎవరి ఇష్టానికి తగినట్లు వారు ఆహారాలను తింటుంటారు. అలాగే కొన్ని ఆహారాలు సులభంగా జీర్ణం అవుతాయి. కానీ కొన్ని జీర్ణం అయ్యేందుకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఇక సులభంగా జీర్ణమయ్యే ఆహారాల్లో నాన్ వెజ్ ఆహారాల విషయానికి వస్తే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చేపలే. ఇవి మనకు ఎన్నో రకాల ప్రయోజనాలను అందించడమే కాదు.. చాలా సులభంగా జీర్ణమవుతాయి కూడా. వీటిల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందువల్ల తరచూ చేపలను తింటే ఎంతో మేలు జరుగుతుంది.
చేపల్లో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. వీటిల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా మారుస్తుంది. అలాగే చేపల్లోని ప్రోటీన్లు మనకు శక్తిని అందిస్తాయి. కండరాల నిర్మాణానికి, శరీర ఎదుగుదలకు ఉపయోగపడతాయి. కనుక పిల్లలకు చేపలను తరచూ ఇస్తుండాలి. దీంతో వారిలో ఎదుగుదల లోపాలు రాకుండా ఉంటాయి.

చేపల్లో మన శరీరానికి ఎంతో అవసరం అయ్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. హార్ట్ ఎటాక్లు రాకుండా చూస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం.. 15 ఏళ్ల పాటు తరచూ ఎక్కువ మొత్తంలో చేపలను తినేవారిలో గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణించే వారి సంఖ్య 10 శాతం వరకు తక్కువగా ఉందని తేల్చారు. కనుక చేపలను తింటే గుండె జబ్బులు బారిన పడకుండా ఉండవచ్చని చెబుతున్నారు.
కాగా చేపలను తినడం వల్ల క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, అల్జీమర్స్, లివర్ వ్యాధులతో మరణించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని తేల్చారు. కనుక ఏవిధంగా చూసినా కూడా చేపలు మనకు మేలే చేస్తాయి. కాబట్టి వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.







